గుంటూరు జిల్లా నరసరావుపేట పార్లమెంటరీ స్థానం నుంచి 'ఆంధ్రా అక్టోపస్'గా పేరుపొందిన లగడపాటి రాజగోపాల్ పోటీ చేస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా లగడపాటి.. సీఎం చంద్రబాబును కలసి చర్చించడంతోపాటు నరసరావుపేట ప్రాంతానికి శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాద్ ను కూడా కలిసి రహస్య చర్చలు జరిపారు.
వయోభారం, అనారోగ్య సమస్యలతో వచ్చే ఎన్నికల్లో నరసరావుపేట సిట్టింగ్ ఎంపీగా ఉన్న రాయపాటి సాంబశివరావు పోటీకి మొగ్గుచూపడం లేదు. ఆయనకు బదులుగా ఆయన కుమారుడు రావిపాటి రంగారావుకు సీటు ఇవ్వాలని కోరుతున్నారు. అయితే రంగారావుకు టీడీపీ క్యాడర్ లో పట్టులేకపోవడం, అనుకున్నంత సమర్థుడు కాకపోవడం వంటి కారణాలతో ఆయన అభ్యర్థిత్వానికి చంద్రబాబు నాయుడు ఇష్టపడటం లేదు.
టీడీపీ తరపున గురజాల, వినుకొండ, సత్తెనపల్లి సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉన్న యరపతినేని శ్రీనివాసరావు, జీవీ ఆంజనేయులు, కోడెల శివప్రసాద్ ల్లో ఎవరో ఒకరిని నరసరావుపేట లోక్ సభ స్థానం నుంచి పోటీ చేయాలని చంద్రబాబు కోరారు. అయితే.. దీనికి ఎవరూ ఇష్టపడటం లేదు. ఎంపీ ఎన్నిక కోసం భారీగా ఖర్చుపెట్టడంతోపాటు ప్రభుత్వ వ్యతిరేకతతో గెలిచే అవకాశం లేకపోవడం ఇందుకు కారణాలు. ఈ నేపథ్యంలోనే విజయవాడ నుంచి రెండుసార్లు ఎంపీగా గెలిచిన లగడపాటి రాజగోపాల్ ను నరసరావుపేట స్థానం నుంచి బరిలోకి దించే యోచనలో చంద్రబాబు ఉన్నారు.
No comments:
Post a Comment