తెలుగుదేశం పార్టీ తరఫున విశాఖపట్నం జిల్లా భీమిలి నుంచి పోటీ చేసే అభ్యర్థి ఎవరో ఇంకా ఖరారు కాలేదు. ఈ స్థానం నుంచి రోజుకో అభ్యర్థి పేరు వినిపిస్తోంది. ప్రస్తుతం అక్కడ రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గంటాను విశాఖ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేయించి భీమిలి నుంచి సీఎం చంద్రబాబు కుమారుడు, మంత్రి నారా లోకేశ్ ను దించుతారని నిన్నటి వరకు వార్తలు వచ్చాయి.
ఇప్పుడు మళ్లీ సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ పేరు వినిపిస్తోంది. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ అక్రమ ఆస్తుల కేసులను గతంలో లక్ష్మీనారాయణ దర్యాప్తు చేశారు. ఆ తర్వాత తన పదవికి రాజీనామా చేసి క్రియాశీల రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించి రాష్ట్రవ్యాప్తంగా పర్యటించిన సంగతి తెలిసిందే. జనసేనతో కలిసి నడుస్తాడని, స్వయంగా కొత్త పార్టీ ఏర్పాటు చేస్తారని, ఇలా రకరకాల వార్తలు వచ్చినా వీటిలో ఏది నిజం కాలేదు. ఈ నేపథ్యంలో తాజాగా మంత్రి గంటా శ్రీనివాసరావు.. హైదరాబాద్ లో లక్ష్మీనారాయణతో చర్చలు జరపడం ఆసక్తి రేకెత్తిస్తోంది.
విశాఖ జిల్లా భీమిలి నుంచి టీడీపీ తరఫున జేడీ లక్ష్మీనారాయణ పోటీ చేస్తారని, విశాఖ ఉత్తరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి నారా లోకేశ్ ను బరిలోకి దించుతారని వార్తలు వస్తున్నాయి. గంటాను విశాఖ లోక్ సభ స్థానం నుంచి బరిలోకి దించనున్నారు. లేదా అదే జిల్లాలో రెండు మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏదో ఒకదాన్ని ఎంచుకోవాల్సిందిగా కోరుతున్నారు. అయితే.. గంటా శ్రీనివాసరావు ఎంపీగా పోటీ చేసే అవకాశాలే ఎక్కువ కనిపిస్తున్నాయి.
No comments:
Post a Comment