రేణుక 'బుట్ట' సర్దుకోవాల్సిందేనా? - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Sunday, February 24, 2019

రేణుక 'బుట్ట' సర్దుకోవాల్సిందేనా?

కర్నూలు ఎంపీ బుట్టా రేణుకకు ఈసారి టికెట్ హుళక్కేనని తెలుస్తోంది. గత ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరఫున కర్నూలు పార్లమెంటరీ స్థానం నుంచి ఆమె ఎంపీగా గెలిచారు. గెలిచిన వెంటనే అదే జిల్లాలోని నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డిలా టీడీపీలోకి ఫిరాయించాలని చూసినా ఎందుకో వెనకడుగు వేశారు. చేనేత సామాజికవర్గానికి చెందిన బుట్టా రేణుకకు హైదరాబాద్ లో మెరిడియన్ స్కూల్ప్ ఉన్నాయి. వీటికి మంచిపేరు కూడా ఉంది.

గెలిచిన మొదట్లోనే బుట్టా రేణుక తన భర్త నీలకంఠంతో చంద్రబాబును కలిసి టీడీపీ సభ్యత్వం కూడా తీసుకున్నారు. అయితే బుట్టా వ్యాపారాలు, స్కూల్స్ మొత్తం తెలంగాణలో ఉండటంతో తెలంగాణ సీఎం కేసీఆర్ ద్వారా వైఎస్ జగన్ ఒత్తిడి తెచ్చారని దీంతో పార్టీ మారకుండా వైఎస్సార్సీపీలోనే కొనసాగారనే వార్తలు వచ్చాయి. రేణుక కూడా చంద్రబాబును నియోజకవర్గ అభివృద్ధి కోసమే కలిశామని, పార్టీ సభ్యత్వం తీసుకోలేదని బుకాయించారు. చేసేదేమీ లేక కొన్నాళ్లు వైఎస్సార్సీపీలోనే ఉన్నా బుట్టా ఎట్టకేలకు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.

వచ్చే ఎన్నికల్లో టీడీపీ తరఫున కర్నూలు ఎంపీగా పోటీ చేస్తారని వార్తలు వచ్చినప్పటికీ మాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి టీడీపీలో చేరుతుండటంతో రేణుకకు ఆ సీటు ఇవ్వడం లేదు. కర్నూలు జిల్లాలోని ఎమ్మిగనూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని వార్తలు వచ్చినప్పటికీ అక్కడ టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి ఉన్నారు. ఈసారి కూడా ఆయనకే సీటు దక్కే అవకాశం కనిపిస్తోంది. కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి చేరికతో బుట్టా రేణుక రాజకీయ భవిష్యత్ డోలాయమానంలో పడింది. సామాజికంగా, ఆర్థికంగా, జిల్లావ్యాప్తంగా పట్టున్న కోట్ల కుటుంబానికే పెద్దపీట వేయడానికి చంద్రబాబు మొగ్గుచూపుతుండటం రేణుకకు అశనిపాతంలా మారింది. వైఎస్సార్సీపీలోనే ఉండి ఉంటే మళ్లీ తనకే సీటు దక్కేదని, అనవసరంగా పార్టీ మారానని పశ్చాత్తాపంలో ఉన్నారట.. రేణుక.



No comments:

Post a Comment

Post Bottom Ad