ప్రజా కూటమి పేరుతో ప్రతిపక్షాలన్నీ దండెత్తివచ్చినా కేసీఆర్ ప్రభంజనం ముందు బొక్కబోర్లా పడ్డాయి. గత సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ సెంటిమెంటుతో కేవలం 63 స్థానాలను కేసీఆర్ గెలిచాడని విమర్శించిన నోళ్లను ప్రస్తుత ప్రభంజనంతో మూయించారు. సంక్షేమ పాలనే ధ్యేయంగా పనిచేసి ప్రజల మన్ననలు పొంది అఖండ విజయాన్ని అందుకున్న కేసీఆరే తెలంగాణ ప్రజా సారథి అనే విషయం మరోసారి సుస్పష్టమైంది.
మూడు నెలలు ముందుగానే ఎన్నికలకు వెళ్లి, వెంటనే అభ్యర్థులను ప్రకటించి అపర రాజకీయ చాణక్యుడిగా వ్యవహరించి ప్రత్యర్థులకు ముప్పుతిప్పలు పెట్టాడు కేసీఆర్. అయితే ముఖ్యమంత్రిగా కేసీఆర్ పాలనకు, ఆయన ప్రవేశపెట్టి అమలు చేసిన సంక్షేమ పథకాలే ఆయన గెలుపునకు ప్రధాన కారణాలుగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రసూతి చికిత్స కోసం కేసీఆర్ కిట్లు నుంచి వృద్ధాప్య పించనులవరకు ఎన్నో పథకాలను కేసీఆర్ అద్భుతంగా అమలు చేశారనడంలో సందేహం లేదు. వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్, కల్యాణలక్ష్మి, రైతుబంధు, కంటి వెలుగు పథకాలే కేసీఆర్ సంక్షేమాభిలాషకు నిదర్శనం.
మొత్తం 119 నియోజకవర్గాల్లో 88 స్థానాలు సాధించిన కేసీఆర్ కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, టీజేఎస్లు కలిసి ఏర్పాటు చేసుకున్న కూటమి కోటలు బద్ధలు కొట్టాడు. కేవలం 21 సీట్లకే కట్టడి చేశాడు. 99 స్థానాల్లో పోటీ చేసిన కాంగ్రెస్ కేవలం 19 స్థానాలే గెలుచుకుంది. 13 స్థానాల్లో పోటీ చేసిన తెలుగు దేశం 2 స్థానాలకే పరిమితమైంది. 8 స్థానాల్లో పోటీ చేసిన తెలంగాణ జనసమితి, మూడు స్థానాల్లో పోటీ చేసిన సీపీఐ పార్టీలు కనీసం బోణీ కూడా కొట్టలేకపోయాయి.
No comments:
Post a Comment