పదేళ్ల పాటు తెలుగు దేశం పార్టీలో కొనసాగి తాజాగా పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, కాంగ్రెస్ కండువా కప్పుకోవడానికి సిద్దపడ్డారు ఎనుముల రేవంత్ రెడ్డి. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు అత్యంత సన్నిహితుడిగా మసలుకుంటూ, ఆయన కార్యక్రమాలు దగ్గరుండి చూసుకునే రేవంత్కు ఇప్పుడు పార్టీని వీడాల్సిన పరిస్థితి ఆసన్నమైంది. 2004లో, 2009లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పుడు, ఆ పార్టీలో సమీప బంధువులు ఉన్నప్పుడు కూడా ఆ పార్టీలో చేరకుండా చంద్రబాబు పార్టీలోనే ఉంటూ ప్రతిపక్షంలోనే కొనసాగారు. 2014లో రాష్ట్రం విడిపోయి తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా టీడీపీలోనే ఉండిపోయారు. పార్టీలోని సీనియర్ నేతలు అధికార పార్టీలో చేరి అభివృద్ధిలో పాలు పంచుకుంటుంటే కూడా తను ఒంటరిగానే ప్రతిపక్షంలో మిగిలిపోయాడు. ఎమ్మెల్సీ ఎలక్షన్లలో టీడీపీ అభ్యర్థికి ఓటు వేసేందుకోసం నామినేటెడ్ శాసన సభ్యులు స్టీఫెన్ కు డబ్బులు ఇస్తూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడి, అరెస్టు కూడా అయ్యారు. అయితే అదంతా తెలంగాణ ప్రభుత్వం, కేసీఆర్ కుట్ర అని చెప్పుకున్నారు.
ఇదిలాఉంటే టీడీపీకి తెలంగాణలో భవిష్యత్తు లేదనే విషయాన్ని ఆలస్యంగా గ్రహించి,
ఇక పార్టీలో కొనసాగితే మునక తప్పదని తెలుసుకుని నష్ట నివారణ చర్యలు ప్రారంభించారు.
ఏపీలో పరిటాల ఇంట్లో వివాహానికి హాజరైన తెలంగాణ సీఎం కేసీఆర్ తో టీడీపీ నాయకులు భేటీ కావడాన్ని సాకుగా చూపిస్తూ పార్టీపై తన అసంతృప్తిని తొలుత వెలిబుచ్చారు. ఒకదశలో టటీడీపీ నేతలు, రేవంత్కు మధ్య మాటల యుద్ధమే జరిగింది.
ఢిల్లీలో కాంగ్రెస్ అధిష్టానాన్ని కలిశారన్న వార్తలు మొదలు, ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో టీడీపీ పొలిట్బ్యూరో భేటీకి హాజరుకావడం, కొడంగల్లో కార్యకర్తల మధ్య ‘ఒక్కొక్కరి గుట్టు బయటపెడతా’నంటూ బెదిరింపుల ప్రసంగం.. తదితర అన్ని సందర్భాల్లోనూ రేవంత్ తనదైన శైలిలోనే దూకుడును ప్రదర్శించారు. ‘ఓటుకు కోట్లు కేసు బాధ్యుడు రేవంతే’, ‘రేవంత్ గుట్టు మొత్తం రట్టుచేస్తాం’ అని టీటీడీపీ నేతలు వ్యాఖ్యానించడం తెలిసిందే. కానీ చంద్రబాబు భేటీ అనంతరం ఎలాంటి ఆరోపణలు లేకుండా తన భవిష్యత్తు కోసమే రేవంత్ పార్టీ మారుతున్నట్లు పరిస్థితి మారిపోయింది. అగ్గిమీద గుగ్గిలంలా మండిన టీటీడీపీ నేతలు రేవంత్ పట్ల ఒక్కసారే ప్రశాంత వైఖరిని ప్రదర్శించడం మొదలు పెట్టారు. మొదట్లో పార్టీలో అసంతృప్తి కారణంగా పార్టీనుంచి వైదొలుగుతున్నట్లు అనిపించినా రేవంత్ ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వంపై కేసీఆర్పై తీవ్ర విమర్శలు చేస్తూ కాంగ్రెస్లో చేరడానికి సిద్ధమయ్యారు. ఇదే విషయం జూబ్లీహిల్స్లోని తన నివాసం వద్ద ఆత్మీయుల మాట ముచ్చట పేరుతో జరిగిన సమావేశంలోనూ రేవంత్రెడ్డి మాటల్లో బయటపడింది. చంద్రబాబు, టీడీపీపై విమర్శలు లేకుండా తెలంగాణ ప్రభుత్వ వ్యతిరేకతను ఉపయోగించి కాంగ్రెస్లో చేరి పోరాటం చేయాలని రేవంత్ భావిస్తున్నాడు.
- ఎస్సార్
No comments:
Post a Comment