కుటుంబమే లేని నాకు కోట్లాది రూపాయల అక్రమార్జన అవసరమేమీ, ప్రజలే నా ఆస్తి, నా ఆస్తి అంతా ప్రజలకే’...ఈ మాటలు అన్నది ఎవరో కాదు, అన్నాడీఎంకే అధినేత్రి, మాజీ ముఖ్యమంత్రి జయలలిత. బెంగళూరు కోర్టులో తీర్పు వెలువడిన వెంటనే న్యాయమూర్తి సమక్షంలో జయ ఈ వ్యాఖ్యలు చేసినట్లు బుధవారం ఓ తమిళ పత్రికలో కథనం వెలువడింది. కోర్టు తీర్పు వెలువడగానే జయ బృందాన్ని బెంగళూరులోని కేంద్ర కారాగారానికి తరలించారు. ఈ నాలుగు రోజుల్లో జయను జైల్లో కొందరు ముఖ్యులు కలుసుకున్నారు. వీరి ద్వారా సేకరించిన సమాచారాన్ని ఓ తమిళ దినపత్రిక ప్రచురించింది. అందులోని వివరాలు ఇలా ఉన్నాయి.... ‘నేను స్వతహాగా ఆస్తిపరురాలిని, సినీ నటిగా ఎంతో సంపాదించాను. రాజకీయాల్లోకి రాక ముందు నుంచే నాకు మంచి ఆస్తి ఉంది. నాకంటూ ఓ కుటుంబమే లేనప్పుడు అక్రమంగా ఆర్జించాల్సిన అవసరం ఏముంది. నాకున్న ఆస్తి అంతా తమిళనాడు ప్రజలే. అందుకే నాకున్న ఆస్తినంతా తమిళనాడు ప్రజలకే అంకితం చేస్తాను. ప్రజాకోర్టులో నన్ను ఢీకొనలేని కొందరు వ్యక్తులు కుట్రపన్ని ఈ కోర్టుద్వారా అక్రమ కేసులను బనాయించి ప్రతీకారం తీర్చుకున్నారు’ అంటూ తీర్పువెలువడిన అనంతరం న్యాయమూర్తికి జయ విన్నవించుకున్నట్లు ఆ పత్రిక కథనంలో పేర్కొంది.
Post Top Ad
Thursday, October 02, 2014
Subscribe to:
Post Comments (Atom)
Post Bottom Ad
Author Prolifile
...
No comments:
Post a Comment