ఒక రకంగా చాలా ఇరకాటంలో పడిపోతున్నట్టుగా ఉన్నారు రాజ్యసభ చైర్మన్, ఉప రాష్ట్ర పతి వెంకయ్య నాయుడు. ఇది వరకూ ధాటిగా వ్యవహరించిన ఆయన ఇప్పుడు ధాటిగా వ్యవహరించలేని స్థితిలో పడిపోనున్నారు. దీని వెనుక ఒక ఆసక్తిదాయకమైన వ్యవహారం ఉంది.
కొన్ని నెలల కిందట ఇద్దరు రాజ్యసభ సభ్యులపై వేటు వేశారు వెంకయ్య నాయుడు. పార్టీల నియమాలను అతిక్రమించారని వారి మీద ఆయన అనర్హత వేటు వేశారు. జేడీయూ కు చెందిన ఇద్దరు రాజ్యసభ సభ్యులపై అప్పుడు వెంకయ్య వేటు వేశారు. వారిలో శరద్ యాదవ్ వంటి సీనియర్ నేత కూడా ఉన్నారు. ఆయనతో పాటు ఒక రాజ్యసభ సభ్యుడు నితీశ్ కుమార్ తీరును వ్యతిరేకించారు. దీంతో వారిపై వెంకయ్య అనర్హత వేటు వేశారు.
ఆర్జేడీని వదిలి అప్పుడు నితీష్ కుమార్ బీజేపీతో చేతులు కలిపారు. దాన్ని వ్యతిరేకించిన ఇద్దరు రాజ్యసభ సభ్యుల మీద వెంకయ్య నాయుడు అప్పుడు వేటు వేయగలిగారు. అప్పుడంటే బీజేపీకి వ్యతిరేకంగా నిలిచారు కాబట్టి ఇద్దరు ఎంపీల మీద చర్యలు తీసుకున్నారు. అదో గొప్పగా చెప్పుకున్నారు.
ఇప్పుడు కమలం పార్టీ వైపుకే పలువురు రాజ్యసభ సభ్యులు చేరుతున్న వైనాలు కనిపిస్తూ ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ తరఫున ఉన్న ఐదు మంది రాజ్యసభ సభ్యులు బీజేపీ వైపు చేరడం ఖాయమైందని వార్తలు వస్తున్నాయి. మరి అదే జరిగితే లెక్క ప్రకారం వారిపై అనర్హత వేటు పడాలి.
జేడీయూ పై తిరగబడ్డ రాజ్యసభ సభ్యులపై వేటు పడ్డట్టే తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యులపై కూడా వేటు పడాలి. అయితే ఇప్పుడు వెంకయ్య అంత ధాటిగా వ్యహరించగలరా? తెలుగుదేశం ఎంపీలపై అనర్హత వేటు వేయగలరా? తద్వారా బీజేపీని ఇబ్బంది పెట్టగలరా? ఈ వ్యవహారాన్ని ఉప రాష్ట్రపతి ఎలా టాకిల్ చేస్తారో! కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం అనే స్థితిని ఎదుర్కొనేలా ఉన్నారు వెంకయ్య నాయుడు.
No comments:
Post a Comment