ఎన్నికల ఫలితాలు వచ్చి దాదాపు నెల రోజులు అవుతున్నా చంద్రబాబు నాయుడు ఎక్కడా పక్కకు కదల్లేదు. అయితే ఆయన ఇప్పుడు అలా విదేశానికి వెళ్లారో లేదో.. ఇటువైపు తెలుగుదేశం పార్టీలో సంక్షోభం మొదలుకావడం గమనార్హం. ఒకవైపు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీ వైపు వెళ్లేందుకు నలుగురు రాజ్యసభ సభ్యులు రెడీ అయిపోగా, మరోవైపు తెలుగుదేశం పార్టీలోని కాపు నేతలు కాకినాడలో సమావేశం ఏర్పాటు చేసి తెలుగుదేశం పార్టీని వీడే ఆలోచన చేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి.
నలుగురు రాజ్యసభ సభ్యులు తెలుగుదేశం పార్టీని వీడేందుకు రెడీ అయ్యారని ఇప్పటికే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అవే నిజం అవుతూ ఉన్నాయి. రాజ్యసభలో టీడీపీ ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేశ్, టీజీ వెంకటేష్, రామలక్ష్మి.. ఈ నలుగురూ బీజేపీలోకి చేరడానికి రెడీ అయిపోయినట్టుగా తెలుస్తోంది. వీరు రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడును కలిసి తమను తెలుగుదేశం ఎంపీలుగా కాకుండా వేరేగా పరిగణించాలని కోరనున్నారని సమాచారం. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు జరిగాయట.
ఇప్పటికే ఈ నలుగురు ఎంపీలూ మోడీ, అమిత్ షాలతో సమావేశం అయినట్టుగా తెలుస్తూ ఉంది. ఇక మరోవైపు కాకినాడలో తెలుగుదేశం పార్టీలోని కాపు నేతలంతా సమావేశం అయ్యారు. వారంతా తెలుగుదేశం పార్టీని వీడేందుకు రెడీ అయినట్టుగా భోగట్టా. అందుకే సమావేశం అయ్యారని, మూకుమ్మడిగా వాళ్లు బీజేపీలోకి చేరే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. అయితే వారు పైకేమో ఖండిస్తూ ఉన్నారు.
కాపు నేతలందరితోనూ ఢిల్లీలో ఉన్న సుజనా చౌదరి టచ్లో ఉన్నారని.. వీళ్లందరినీ బీజేపీలోకి తీసుకెళ్లడం విషయంలో ఆయన కసరత్తు సాగుతూ ఉందని సమాచారం.
చంద్రబాబు నాయుడు అలా విదేశీ పర్యటనకు వెళ్లారో లేదో.. ఇటు వైపున నేతలు జంపింగ్ చేస్తూ ఉండటం గమనార్హం. చంద్రబాబు నాయుడు వారం రోజులు పాటు యూరప్ పర్యటనకంటూ వెళ్లారు. ఆయన వచ్చే లోపే తెలుగుదేశం పార్టీ చాలా వరకూ ఖాళీ అయ్యే అవకాశాలున్నాయనే అభిప్రాయాలు వినిపిస్తూ ఉండటం గమనార్హం.
No comments:
Post a Comment