భారతీయజనతా పార్టీలోకి తెలుగుదేశం పార్టీ ఎంపీలు నలుగురు చేరిన వ్యవహారం అంతా తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడి వ్యూహ ప్రకారమే జరిగిందనే మాట గట్టిగా వినిపిస్తూ ఉంది. చంద్రబాబు నాయుడే నలుగురు ఎంపీల చేరికకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని, ఆ మేరకు వారు వెళ్లి బీజేపీ నేతలను కలవడం జరిగిందనే మాట వినిపిస్తూ ఉంది. ఈ అభిప్రాయానికి మరింత బలం చేకూర్చేలా ఉన్నాయి ఫిరాయింపు ఎంపీల మాటలు.
ఈ విషయంలో ముందుగా ఎంపీ టీజీ వెంకటేష్ మాటలను గమనిస్తే.. 'వారం కిందటే చంద్రబాబు నాయుడుకు పార్టీ మారబోతున్న విషయాన్ని చెప్పాను..' అని ఆయన వ్యాఖ్యానించారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత తను వెళ్లి చంద్రబాబును కలిసి పార్టీ మారే విషయాన్ని చెప్పినట్టుగా టీజీ వెంకటేష్ వివరించారు. దానికి చంద్రబాబు నాయుడు పెద్దగా అభ్యంతరం చెప్పినట్టుగా ఆయన చెప్పలేదు. ఇలా ఎంపీలు ఫిరాయించేందుకు రెడీగా ఉన్నా చంద్రబాబు నాయుడు తాపీగా విదేశానికి వెళ్లిపోయారు.
ఇక తెలుగుదేశం పార్టీపై మమకారాన్ని దాచుకోలేకపోయాడు సుజనా చౌదరి. తెలుగుదేశం పార్టీ బాగుపడాలని కోరుకునే వాళ్లలో తనే ముందుండబోతున్నట్టుగా సుజనా చౌదరి చెప్పుకొచ్చారు. ఇలా వీళ్లంతా తెలుగుదేశం పార్టీపై తమ అభిప్రాయాలను చెబుతూ ఉన్నారు. తద్వారా టీడీపీ అంటే తమకు ఎంత అభిమానం ఉందో వివరిస్తూ ఉన్నారు.
ఇక సుజనా చౌదరి, సీఎం రమేశ్ లతో చంద్రబాబు నాయుడి అనుబంధం ఏమిటో కూడా వివరించనక్కర్లేదు. వారిద్దరూ దశాబ్దాలుగా చంద్రబాబుకు అత్యంత ఆంతరంగిక నేతలుగా ఉన్నారు. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా వారికి చంద్రబాబు నాయుడు చాలా ప్రాధాన్యతను ఇచ్చారు. వారిని రాజ్యసభకు నామినేట్ చేశారు.
అలాంటి వారు ఇప్పుడు చంద్రబాబుకు ద్రోహం చేసి వెళ్లే అవకాశాలు లేవు. ఈ విషయాలన్నింటిని పరిశీలించిన పిమ్మట ఇదంతా వ్యూహం ప్రకారమే జరిగిందని, చంద్రబాబు నాయుడే వారిని పంపించారనే మాట బలంగా వినిపిస్తూ ఉంది.
No comments:
Post a Comment