'ప్రకృతి స్నేహి' వాహనాల సంచారాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో కర్ణాటకలో ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య గణనీయంగా పెరగనుంది. అంతేకాదు దేశంలోనే అత్యధికంగా 15 వేల వాహనాలు కలిగిన రాష్ట్రంగా ఘనతకెక్కనుంది. ఏడాది ఆరంభంలో రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య రెండు అంకెలు కూడా దాటలేదు. అయితే పరిసర స్నేహి వాహనాల వినియోగంతో అధిక ప్రాధాన్యం ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం చట్టం రూపొందించి అమలు చేయడానికి చర్యలు చేపట్టిన అనంతరం ప్రజల దృష్టి ఎలక్ట్రిక్ వాహనాలపై మళ్లింది. ఢిల్లీ, ముంబయి, కోల్కతా, చెన్నై కంటే అత్యధికంగా ఎలక్ట్రిక్ వాహనాలు కర్ణాటకలో ఉన్నాయి.
ప్రస్తుతం ఉన్న మొత్తం వాహనాల్లో సగానికి పైగా బెంగళూరు నగరంలోనే ఉండటం విశేషం. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరగాలంటే పెట్రోల్ బంక్ తరహాలో అన్ని చోట్ల చార్జింగ్ కేంద్రాలు అందుబాటులో ఉండాలి. అయితే ఇప్పటికే బెంగళూరు నగరంలో విధానసౌధ, వికాససౌధ వద్ద ఎలక్ట్రిక్ వాహనాల చార్జింగ్ కేంద్రాలు ప్రారంబించారు. బెస్కాం కార్పొరేట్ కార్యాలయంతో పాటు నగరంలో 11 కేంద్రాలను అందుబాటులోకి తెచ్చారు. వచ్చే ఆగష్టు చివరి నాటికి 101 చార్జింగ్ కేంద్రాలు ప్రారంభం కానున్నాయి.
బెంగళూరులో ద్విచక్రవాహనాల సంఖ్య 48 లక్షలు దాటింది. కారు, బస్, లారీతో పాటు అన్ని రకాల వాహనాలు 75 లక్షలు పైగా ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న రోడ్లు సామర్ధ్యం అంతంత మాత్రంగానే ఉన్నా.. వాహనాల సంఖ్య మాత్రం పెరుగుతూనే ఉంది. ఫలితంగా వాహనాల ర ద్దీతో పాటు మరో పక్క వాహనాల నుంచి వెలువడే పొగతో పరిసరాల కాలుష్యం కూడా మితిమీరిపోతోంది. దీనికోసం ప్రకృతి స్నేహి (పొగరహిత) వాహనాలకు డిమాండ్ పెరిగింది. రాష్ట్రంలో 5 వేల ఎలక్ట్రిక్ కార్లు ఉండగా, బెంగళూరులోనే 4,200 కార్లతో పాటు రాష్ట్రంలో 8 వేలపైగా బైకులు ఉన్నాయి. ప్రకృతి స్నేహి వాహనాలను నడపాలని నిర్ణయించిన బెంగళూరు మహానగర రవాణా సంస్ధ (బీఎంటీసీ) 150 ఎలక్ట్రిక్ బస్సులను కొనుగోలు చేయాలని తీర్మానించింది.
డీసీ.చార్జ్, ఏసీ చార్జ్ , డైరెక్ట్ చార్జింగ్ పెడితే ఒక గంటలో బ్యాటరీలు పూర్తిగా చార్జింగ్ అవుతాయి. ఏసీ చార్జింగ్ చేస్తే కనీసం 5 గంటలు సమయం పడుతుంది. డైరెక్ట్ చార్జ్ చేసే సెంటర్లు నిర్మాణానికి రూ.4 నుంచి రూ.5 లక్షలు నిధులు అవసరం. ఏసీ చార్జింగ్ సెంటర్కు రూ.50 వేల నుంచి రూ.లక్ష సరిపోతుంది. సరాసరి 100 కిలోమీటర్లు మైలేజ్ బ్యాటరీ ఆధారిత ఎలక్ట్రిక్ వాహనాలను కనీసం 100 నుంచి 120 కిలోమీటర్లు మైలేజ్ అందించే సామర్ద్యం కలిగి ఉన్నాయి.
ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించే దృష్టితో బెస్కాం కార్పోరేట్ కార్యాలయంలో ఉచితంగా చార్జింగ్ చేస్తున్నారు. 120 కిలోమీటర్లు మేర ప్రయాణించే సామర్ధ్యం ఉన్న బ్యాటరీలను గంట చార్జింగ్ పెడితే చాలు. బ్యాటరీ చార్జ్ చేసిన అనంతరం ప్రతి యూనిట్కు రూ.4 నుంచి రూ.5 ధర విధించాలని ఆలోచిస్తున్నారు. చార్జింగ్ చేసుకోవడానికి 18 నుంచి 20 యూనిట్ విద్యుత్ చాలు. రూ.70 సరాసరి బ్యాటరీ చార్జింగ్ చేసే అవకాశం ఉంది. దీంతో పెట్రోల్ ధర కంటే ఎలక్ట్రిక్ చార్జింగ్ అధికంగా ఉంది. బెంగళూరులో ప్రకృతి స్నేహి వాహనాలను ప్రోత్సహించడానికి ఆగష్టు నాటికి కొత్తగా 101 చోట్ల చార్జింగ్ కేంద్రాలు ప్రారంభించనున్నారు.
No comments:
Post a Comment