ఏపీ కేబినెట్లో రెడ్డి సామాజికవర్గానికి దక్కింది అతి తక్కువ మంత్రి పదవులు అనే అంశం సర్వత్రా చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. జగన్ కేబినెట్ ఏర్పాటు అప్పుడే ఈ అంశం మీద తీవ్రమైన చర్చ జరిగింది. ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఏనాడూ దక్కనన్ని తక్కువ స్థాయిలో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రెడ్లకు మంత్రి పదవులు దక్కాయి. వైఎస్ కేబినెట్ ను చూసినా, అంతకు ముందు , ఆ తర్వాత కాంగ్రెస్ ముఖ్యమంత్రుల హయాంలో చూసినా రెడ్లకు గణనీయమైన సంఖ్యలో మంత్రి పదవులు దక్కాయి. అయితే జగన్ కేవలం నలుగురు రెడ్లకు మాత్రమే మంత్రి పదవులు ఇచ్చారు.
ఈ అంశం మీద రెడ్లి సామాజికవర్గంలో కొంత అసంతృప్తి కూడా నెలకొని ఉండవచ్చు. ఇలాంటి క్రమంలో ఈ అంశం మీద జగన్ మోహన్ రెడ్డి స్వయంగా స్పందించారు. రెడ్లకు మంత్రి పదవులు దక్కకపోవడం గురించి ఆయన అసెంబ్లీలో మాట్లాడారు. ఆ విషయాన్ని జగన్ కూడా ఒప్పుకున్నారు.
జగన్ ఏమన్నారంటే.. 'నా సొంత సామాజికవర్గానికి తక్కువ మంత్రి పదవులే ఇచ్చాను.. సామాజిక న్యాయం చేయడానికి, బడుగు బలహీన వర్గాలకు రాజకీయ అధికారం ఇవ్వాలనే కార్యచరణలో భాగంగా అలా చేయాల్సి వచ్చింది..' అని జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు.
ఈ అంశంలో అంబటి రాంబాబు కూడా స్పందించారు. జగన్ తన సొంత సామాజికవర్గానికి మంత్రి పదవులు విషయంలో ప్రత్యేక ప్రాధాన్యతను ఇవ్వలేదని అంబటి రాంబాబు అన్నారు. బడుగు బలహీన వర్గాలకే ప్రాధాన్యతను ఇచ్చారన్నారు. అదే తెలుగుదేశం హయాంలో చంద్రబాబు సొంత సామాజికవర్గానికి ఎన్ని మంత్రి పదవులు దక్కాయో లెక్క పెట్టాలని ఆ పార్టీ నేతలను ఉద్దేశించి అంబటి రాంబాబు అన్నారు.
మొత్తానికి తన సొంత సామాజికవర్గానికి మంత్రివర్గంలో తక్కువ ప్రాధాన్యత దక్కిందని జగన్ ఒప్పుకున్నారు. మరి ఈ అంశం మీద రెడ్డి సామాజికవర్గీయులు ఏమనుకుంటున్నారో!
No comments:
Post a Comment