తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటనలో ఉండగా.. ఆ పార్టీలో సంక్షోభం తలెత్తిందనే మాట గట్టిగా వినిపిస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు ప్రస్తుతం యూరప్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ సంక్షోభం అనేది చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటనలో ఉండగా తలెత్తినది కాదని, సంక్షోభం రేపడానికే చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటనకు వెళ్లారు.. అనే మాట వినిపిస్తోంది!
ప్రస్తుతం తెలుగుదేశం చేతిలో అధికారం లేదు. అత్యంత చిత్తుగా ఓడిపోయింది ఆ పార్టీ. ఆ పార్టీకి మిగిలింది కేవలం ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు మాత్రమే. ముగ్గురు ఎంపీలున్నారు. ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీతో అధికారాన్ని సొంతం చేసుకుంది. ఐదేళ్ల తర్వాత అయినా తెలుగుదేశం పార్టీ అధికారాన్ని దక్కించుకుంటుందని ఎవరూ చెప్పలేకపోతున్నారు. దానికి అనేక రీజన్లున్నాయి. చంద్రబాబుకు వయసు మీద పడటం, లోకేష్ కు అంత శక్తిసామర్థ్యాలు కనిపించకపోవడం.. వంటి కారణాల చేత తెలుగుదేశం పార్టీ భవితవ్యం ప్రశ్నార్థకం అవుతోంది.
ఈ టెన్షన్ చంద్రబాబుకు కూడా మొదలైందని సమాచారం. గత ఐదేళ్ల పాలనలో చాలా తప్పులు జరిగాయి. వాటిపై కేసులు గట్రా మొదలయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. అందుకే చంద్రబాబు నాయుడు కేంద్రం నుంచి ముప్పు రాకుండా, ముప్పు వస్తున్న సంకేతాలను ముందస్తుగా తెలుసుకోవడానికి, అక్కడ కొంతమంది లాబీయిస్టులను అధికార పార్టీకి సఖ్యతగా ఉంచడానికి తన పార్టీ నుంచి ఎంపీలను పంపించారనే మాట వినిపిస్తూ ఉంది.
ఈ వ్యూహంతో ఇక్కడ ఎంపీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి చంద్రబాబు నాయుడు విదేశానికి వెళ్లిపోయారని, తను ఇక్కడే ఉండగా అలాంటివి జరిగితే మరింతగా పరువు పోతుందనే లెక్కలతో చంద్రబాబు నాయుడు అలా విదేశానికి పయనం అయ్యారని.. చంద్రబాబు నాయుడు విదేశంలో ఉండగా ఇక్కడ సంక్షోభం తలెత్తడం కాదు, ఇక్కడ రచ్చ రేగే సమయానికి తను దేశంలోనే లేకుండా చంద్రబాబు నాయుడు వ్యూహాన్ని పన్నారనే అభిప్రాయాలు వినిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుత పరిణామాలు అందుకు ఊతంగా నిలుస్తూ ఉన్నాయని పరిశీలకులు అంటున్నారు.
No comments:
Post a Comment