కర్ణాటకలోని మాండ్య ఎంపీ స్థానం నుంచి కన్నడ రెబల్ స్టార్ అంబరీష్ సతీమణి, ఒకప్పటి ప్రముఖ హీరోయిన్ సుమలత పోటీ చేయడం ఖాయమైంది. స్వయంగా ఆమే ఈ విషయాన్ని నిర్ధారించారు. గతంలో మాండ్య ఎంపీగా మూడుసార్లు గెలుపొంది కేంద్రంలో మంత్రి పదవిని కూడా నిర్వహించిన అంబరీష్ కొద్ది నెలల క్రితం అనారోగ్యంతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తరఫున మాండ్య నుంచి వచ్చే ఎన్నికల్లో సుమలత పోటీ చేయడానికి నిశ్చయించుకున్నారు.
అయితే.. ప్రస్తుతం కర్ణాటకలో జనతాదళ్ (సెక్యులర్), కాంగ్రెస్ పార్టీ సంకీర్ణ సర్కార్ అధికారంలో ఉంది. మాండ్య ప్రాంతంలో కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి సామాజికవర్గమైన ఒక్కళిగలు భారీ సంఖ్యలో ఉన్నారు. జేడీఎస్ బలంగా ఉంది కూడా అక్కడే. అంబరీష్ కూడా ఒక్కళిగ సామాజికవర్గానికి చెందినవారే. కర్ణాటక రాష్ట్ర జనాభాలో వీరి శాతం 12 శాతం. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ - జేడీఎస్ పొత్తులో భాగంగా కుమారస్వామి కుమారుడు, కన్నడ సినీ నటుడు నిఖిల్.. మాండ్య నుంచి ఎంపీగా పోటీ చేయడానికి ఆసక్తి చూపుతున్నారు.
మరోవైపు కాంగ్రెస్ పార్టీ పొత్తులో భాగంగా ఈ సీటును జేడీఎస్ కు ఇచ్చేట్టయితే తాను ఇండిపెండెంట్ గానైనా పోటీ చేస్తానని సుమలత చెబుతున్నారు. మాండ్య గండడుగా, కన్నడ రెబల్ స్టార్ గా పేరుగాంచిన అంబరీష్ కు అభిమానులు భారీ స్థాయిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో సుమలత ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే ఆమెకు మద్దతు ఇస్తామని బీజేపీ చెప్పినట్టు సమాచారం. ఈ మేరకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా.. సుమలతకు ఫోన్ చేసి తన మద్దతు తెలిపినట్టు తెలుస్తోంది.
No comments:
Post a Comment