కిసాన్‌ క్రాంతి యాత్రను అడ్డుకున్న ఢిల్లీ పోలీసులు - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Wednesday, October 03, 2018

కిసాన్‌ క్రాంతి యాత్రను అడ్డుకున్న ఢిల్లీ పోలీసులు


ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, హరియాణా, పంజాబ్‌తోపాటు ఇతర ప్రాంతాల నుంచి సుమారు 70వేల మంది రైతులు సెప్టెంబర్‌ 23న హరిద్వార్‌లో ప్రారంభించిన కిసాన్‌ క్రాంతి యాత్రను న్యూఢిల్లీలో పోలీసులు అడ్డుకున్నారు. భారతీయ కిసాన్‌ యూనియన్‌(బీకేయూ) నిర్వహిస్తున్న ఈ యాత్రలో రైతులను చెదరగొట్టేందుకు ఢిల్లీ పోలీసులు వాటర్‌క్యానన్లు, బాష్పవాయువు ప్రయోగించారు. దీంతో ఢిల్లీ–ఉత్తరప్రదేశ్‌ సరిహద్దుల్లో మంగళవారం ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. రైతుల దాడిలో ఏసీపీ సహా ఏడుగురు గాయపడ్డారు. స్వామి నాథన్‌ కమిటీ సిఫార్సుల అమలు వంటి కీలక డిమాండ్లపై ప్రభుత్వం ఆమోదం కోసం రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. గత నెల 23న బీకేయూ అధ్యక్షుడు నరేశ్‌ తికాయత్‌ ఆధ్వర్యంలో  ట్రాక్టర్లు, ట్రాలీలతో ర్యాలీ నిర్వహించిన రైతులను పోలీసులు నిలువరించే సమయంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్తగా తూర్పు, ఈశాన్య ఢిల్లీ ప్రాంతాల్లో పోలీసులు నిషేధాజ్ఞలు విధించారు. దీంతో రైతులు ఢిల్లీ–యూపీ సరిహద్దుల్లోనే కిలోమీటర్‌ మేర మకాం వేశారు. వెంట తెచ్చుకున్న దుస్తులు, దుప్పట్లు వేసుకుని ట్రాక్టర్లు, ట్రాలీల పక్కనే నిద్రకు ఉపక్రమించారు.

No comments:

Post a Comment

Post Bottom Ad