తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. మెదక్ జిల్లా ఆందోల్ తాజా మాజీ శాససభ్యుడు, సినీనటుడు బాబూ మోహన్ టీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి భారతీయ జనతా పార్టీలో చేరారు. తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ తో కలసి ఢిల్లీ వెళ్లిన బాబూమోహన్ అక్కడ బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో పార్టీలో చేరారు. ఇటీవల తెలంగాణ అసెంబ్లీ రద్దు అయ్యాక కేసీఆర్ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే 105 మంది అభ్యర్థుల జాబితాను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ జాబితాలో బాబూ మోహన్ పేరు లేదు. ఆందోల్ (ఎస్సీ రిజర్వుడ్) సీటును జర్నలిస్టు క్రాంతికి కేటాయించడంతో తీవ్ర ఆగ్రహం చెందిన బాబూ మోహన్ బీజేపీలో చేరారు. బాబూ మోహన్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. ఇటీవల టీఆర్ఎస్ నిర్వహించిన ప్రగతి నివేదన సభ సందర్భంగా పార్టీ కార్యకర్తలను కాలెత్తి తన్నడానికి ప్రయత్నించడం, అధికారులను దూషించడం తదితర కారణాలతో బాబూ మోహన్ కు టికెట్ నిరాకరించినట్టు ప్రచారం జరిగింది. కాంగ్రెస్ లో చేరడానికి ప్రయత్నించినా మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ పోటీలో ఉండటంతో
బాబూమోహన్ భీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.
No comments:
Post a Comment