జగిత్యాల జిల్లా కొండగట్టులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో డ్రైవర్ శ్రీనివాస్తో పాటు 60 మందికి పైగా ప్రాణాలు కొల్పోయి, మరికొందరు ప్రాణాలతో పోరాడుతున్న విషయం తెలిసిందే. ఈ రోజు అలాంటిదే మరో ప్రమాదం జమ్మూ, కశ్మీర్లోని కిష్త్వార్ జిల్లాలో చోటుచేసుకుంది. ఒక మినీ బస్సు లోయలోకి పడిపోవడంతో 13 మంది చనిపోగా, మరో 13మంది తీవ్రంగా గాయపడ్డారు.
సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ రాజిందర్ గుప్తా అందించిన సమాచారం ప్రకారం కాశ్వాన్ నుంచి కిష్త్వార్ కు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. మినీ బస్సు డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో వాహనం చెనాబ్ నది సమీపంలో 300అడుగుల లోతు లోయలోకి పడిపోయింది. బస్సులో మొత్తం 30మంది ప్రయాణీకులున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, గాయపడిన వారిని హెలికాప్టర్ ద్వారా ఆసుపత్రులకు తరలించే ఏర్పాటు చేస్తున్నామని కిష్త్వార్ డిప్యూటీ కమిషనర్ అంగ్రేజ్ సింగ్ రాణా ప్రకటించారు. ప్రమాదంలో చనిపోయినవారికి 5లక్షల రూపాయలు, క్షతగాత్రులకు 50వేల రూపాయల పరిహారాన్నిప్రకటించారు. ప్రమాదంపై పీపుల్స్ డెమొక్రాటిక్ పార్టీ చీఫ్, మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ, జమ్మూ కాశ్మీర్ ట్రాన్స్పోర్టేషన్ కమిషనర్ ఎస్పీ వాయిద్ ట్విటర్లో సంతాపం తెలిపారు.
No comments:
Post a Comment