తెలంగాణలో టీవీ ప్రసారాల నిలిపివేతపై రాజ్యసభలో చర్చ ప్రారంభం
న్యూఢిల్లీ : ప్రజాస్వామ్యంలో ప్రతికా స్వేచ్ఛ విలువైనదని టీడీపీ ఎంపీ సుజనా చౌదరి అన్నారు. తెలంగాణలో ఏబీఎన్-ఆంధ్రజ్యోతి, టీవీ 9 ప్రసారాల నిలిపివేతపై శుక్రవారం రాజ్యసభలో చర్చ ప్రారంభమైంది. ఈ సందర్భంగా సుజనా చౌదరి మాట్లాడుతూ ఆర్టిక్ 19(1) ప్రకారం భావప్రకటన స్వేచ్ఛను కాపాడాల్సిన అవసరముందని ఆయన అన్నారు. తెలంగాణలో రెండు చానళ్ల ప్రసారాలను నిలిపివేత అంశాన్ని సభలో ప్రస్తావించారు.
ఆంధ్రప్రదేశ్ను అశాస్త్రీయ పద్దతిలో విభజించారని ఎంపీ వాఖ్యానించారు. తెలంగాణ ప్రజల మనోభావాలను కించపర్చేలా ప్రసారాలు చేశారని కొన్ని చానెళ్లపై కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించారన్నారు. ఆ చానెళ్లపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ శాసనసభ, మండలిలో తీర్మానం చేశారని, రెండు చానళ్ల ప్రసారాలను నిలిపివేయించిందన్నారు. జూన్ 16 నుంచి దాదాపు వంద రోజులుగా తెలంగాణలో ఏబీఎన్, టీ వీ9 ప్రసారాలు నిలిచిపోయాయన్నారు. చానెళ్ల ప్రసారాలను నిలిపివేసే అధికారం ఎంఎస్వోలకు ఉందా అని ఎంపీ ప్రశ్నించారు.
ప్రసారాలను ఆపే హక్కు ఎంఎస్వోలకు లేదని గతంలో సుప్రీం కోర్టు చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. సొంత ఎజెండాతో పాలించే అధికారం ఎవరికైనా ఉందా అని సభలో ప్రశ్నించారు. తెలంగాణలో మీడియాపై ఆంక్షలను ప్రతి ఒక్కరూ ఖండించాలన్నారు. తెలంగాణలో ఎంఎస్వోలకు ప్రభుత్వం మద్దతు ఇస్తోందని ఆయన ఆరోపించారు. సమాజవికాసానికి మీడియాకు స్వేచ్ఛ ఎంతో అవసరమని ఎంపీ సుజనా చౌదరి సభలో అన్నారు. సుజనా ప్రసంగానికి టీఆర్ఎస్ ఎంపీ కే.కేశవరావు అడ్డుతగిలే ప్రయత్నం చేశారు.
No comments:
Post a Comment