ఫైనల్లో 3 వికెట్లతో పంజాబ్పై కోల్కతా గెలుపు.మనీశ్ పాండే అద్భుత ఇన్నింగ్స్ సాహా సెంచరీ వృథా . కోల్కతా: రూ. 15 కోట్లు పంజాబ్: రూ. 10 కోట్లు కోల్కతా మళ్లీ సాధించింది...రెండేళ్లనాటి అద్భుత ప్రదర్శనను పునరావృతం చేసింది. సీజన్ ఆరంభంలో పేలవంగా ఆడిన గంభీర్ సేన... టోర్నీ ద్వితీయార్ధంలో సంచలన ఆటతీరు కనబరచింది. ప్రత్యర్థి భారీ స్కోరు చేసినా బెదరకుండా... ఆత్మవిశ్వాసంతో ఆడి షారుఖ్కు మరో టైటిల్ను కానుకగా అందించింది.
రెండు కొదమసింహాల్లాంటి జట్ల మధ్య జరిగిన భారీ స్కోర్ల పోరాటంలో పంజాబ్ చేతులెత్తేసింది. సాహా అద్భుతమైన సెంచరీ చేసినా ప్రీతి జింటా టైటిల్ కరవును తీర్చలేకపోయాడు. ఫైనల్లో కోల్కతా గెలిచినా... రెండు జట్ల పోరాటంతో క్రికెట్ అభిమానులు మాత్రం చివరి వరకూ నరాలు తెగే ఉత్కంఠను అనుభవించారు.
బెంగళూరు: మూడు వారాల క్రితం... ఈ సీజన్ ఐపీఎల్లో సగం మ్యాచ్లు ముగిశాక... కోల్కతా టైటిల్ గెలుస్తుందని ఎవరైనా అంటే అదో పెద్ద జోక్. తాము ప్లే ఆఫ్కు చేరడమే గొప్ప అని ఆ జట్టు కెప్టెన్ స్వయంగా చెప్పిన పరిస్థితి. అలాంటి కోల్కతా మ్యాజిక్ చేసింది. వరుసగా 9వ మ్యాచ్లో గెలిచి ఔరా అనిపించింది.
ఇన్నాళ్లూ గెలిచిన మ్యాచ్లు ఒకెత్తయితే... ఈసారి ఫైనల్లో పంజాబ్ను ఓడించడం మరో ఎత్తు. వరుసగా రెండు సార్లు కోల్కతా చేతిలో ఓడి కసి మీదున్న పంజాబ్ తమ సర్వశక్తులూ ఒడ్డి భారీ స్కోరు సాధించినా... సమష్టి మంత్రంతో రాణించిన నైట్రైడర్స్ 3 వికెట్ల తేడాతో గెలిచి ఐపీఎల్7 విజేతగా నిలిచింది. చిన్నస్వామి స్టేడియంలో ఆదివారం జరిగిన ఫైనల్లో... టాస్ గెలిచిన గంభీర్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. పంజాబ్ కింగ్స్ ఎలెవన్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 199 పరుగుల భారీ స్కోరు సాధించింది.
వృద్ధిమాన్ సాహా (55బంతుల్లో 115 నాటౌట్; 10 ఫోర్లు, 8సిక్సర్లు) సంచలన ఇన్నింగ్స్ ఆడి సెంచరీ చేశాడు. మనన్ వోహ్రా (52బంతుల్లో 67; 6 ఫోర్లు, 2సిక్సర్లు) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అనంతరం భారీ విజయలక్ష్యంతో బరిలోకి దిగిన కోల్కతా మూడు బంతుల ముందే మ్యాచ్ ముగించింది. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ మనీశ్ పాండే (50 బంతుల్లో 94, 7 ఫోర్లు, 6 సిక్సర్లు) సూపర్ ప్రదర్శనతో పాటు యూసుఫ్ పఠాన్ (22 బంతుల్లో 36; 4 సిక్సర్లు) మెరుపులతో ఆ జట్టు 19.3 ఓవర్లలో 7వికెట్లకు 200పరుగులు సాధించింది. 2012లో ఐపీఎల్ టోర్నీ నెగ్గిన కోల్కతా రెండో సారి టైటిల్ను తమ ఖాతాలో వేసుకొని చెన్నైతో సమంగా నిలవడం విశేషం.
మ్యాన్ ఆఫ్ ద ఫైనల్ :: మనీష్పాండే (కోల్కతా)
అత్యంత విలువైన ఆటగాడు :: మ్యాక్స్వెల్ (పంజాబ్)
ఆరెంజ్ క్యాప్ (అత్యధిక పరుగులు) :: ఉతప్ప (కోల్కతా, 660 పరుగులు)
పర్పుల్ క్యాప్ (అత్యధిక వికెట్ల) :: మోహిత్ శర్మ (చెన్నై, 23 వికెట్లు)
ఎమర్జింగ్ క్రికెటర్ :: అక్షర్ పటేల్ (పంజాబ్)
ఫెయిర్ ప్లే అవార్డు :: చెన్నై సూపర్ కింగ్స్
ఉత్తమ క్యాచ్ :: పొలార్డ్ (ముంబై)
మూడు సార్లు ఐపీఎల్ గెలిచిన తొలి క్రికెటర్ యూసుఫ్ పఠాన్. 2008లో రాజస్థాన్, 2012, 14లలో కోల్కతాలో పఠాన్ సభ్యుడు.
No comments:
Post a Comment