గవర్నర్ చెప్పితే రాష్ట్రపతి పాలన! - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Tuesday, September 03, 2013

గవర్నర్ చెప్పితే రాష్ట్రపతి పాలన!



సమైక్యాంధ్రప్రదేశ్ కోసం జరుగుతున్న ఆందోళనల వల్ల పరిస్థితులు అదుపుతప్పుతున్నాయని రాష్ట్ర గవర్నర్ నివేదిక పంపిస్తే.. దాని ఆధారంగా ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలన విధిస్తామని కేంద్ర ప్రభుత్వం సోమవారం హైకోర్టుకు నివేదించింది. రాష్ట్ర విభజనపై తాము ఇప్పటి వరకు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని కేంద్రం మరోసారి హైకోర్టుకు స్పష్టంచేసింది. సమైక్యాంధ్ర ఉద్యమం వల్ల రాష్ట్రంలో పరిస్థితులు నియంత్రించలేని స్థాయికి చేరుకుంటే ఏం చేస్తారన్న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కళ్యాణ్‌జ్యోతిసేన్‌గుప్తా ప్రశ్నకు.. కేంద్ర ప్రభుత్వం తరఫున అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ పొన్నం అశోక్‌గౌడ్ పైవిధంగా స్పందించారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను కేంద్రం జాగ్రత్తగా పరిశీలిస్తోందని చెప్పారు.

 ఉద్యోగుల సమ్మె వ్యవహారం రాష్ట్ర పరిధిలోనిదని, దీంతో కేంద్రానికి ఎటువంటి సంబంధం లేదని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ సీమాంధ్ర ఉద్యోగులు సమ్మె చేస్తున్నారని, రాజకీయ అంశమైన రాష్ట్ర విభజన గురించి సమ్మె చేసే హక్కు ప్రభుత్వ ఉద్యోగులకు లేదని పేర్కొంటూ హైదరాబాద్‌కు చెందిన న్యాయవాది రవికుమార్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాన్ని ఇప్పటికే పలుమార్లు విచారించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కళ్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ ఖండవల్లి చంద్రభానులతో కూడిన ధర్మాసనం సోమవారం మరోసారి విచారించింది. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది సరసాని సత్యంరెడ్డి వాదనలు వినిపించగా.. ఏపీఎన్‌జీవోల తరఫున సీనియర్ న్యాయవాది సి.వి.మోహన్‌రెడ్డి, కేంద్ర ప్రభుత్వం తరఫున అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ పొన్నం అశోక్‌గౌడ్, రాష్ట్ర ప్రభుత్వం తరఫున వి.సి.హెచ్.నాయుడు తమ తమ వాదనలను వినిపించారు.

No comments:

Post a Comment

Post Bottom Ad