విశాఖపట్నం
: వైఎస్సార్సీపీ పార్టీలో మహిళలకు రక్షణ, గౌరవం లేదని అరకు ఎంపీ కొత్తపల్లి గీత ఆరోపించారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ వైసీపీ నేతల తల్లికో చెల్లికో సమస్య వస్తేనే సమస్య నాకు సమస్య వస్తే స్పందించరా అని ఆమె ప్రశ్నించారు. రాజీనామా చేసేంత తప్పు చేయలేదని ఆమె అన్నారు. సీఎంను కలిసినందుకు తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, సాక్షిలో తప్పుడు కథనాలు ప్రచురించారని గీత ధ్వజమెత్తారు.
పాడేరు ఎమ్మెల్యే ఈశ్వరి తనపై చేసిన ఆరోపణలు అర్థరహితమని, ఆమె ఆరోపణలు వ్యక్తిగతమా లేక పార్టీ తరపున మాట్లాడుతున్నారా అని ప్రశ్నించారు.తన కులంపై వైసీపీ అనవసర రాద్ధాంతం చేస్తోందని, తనకు బీఫామ్ ఇచ్చినప్పుడు కులం గురించి తెలియదా అని ఎంపీ గీత నిలదీశారు.
పాడేరు ఎమ్మెల్యే ఈశ్వరి తనపై నిరాధారమైన అభాండాలు వేస్తున్నారంటూ అరకు ఎంపీ కొత్తపల్లి గీత గురివిందగింజ సామెతను గుర్తు చేసుకున్నారు. బాక్సైట్ గనులు తవ్వుకోవడానికే అంటూ తనపై ఆరోపణలు చేసినవారి గురించి ప్రస్తావిస్తూ ఎవరి చరిత్ర ఏమిటో మా నామినేషన్ పత్రాలు చూస్తేనే తెలుస్తుందని ఆమె వ్యాఖ్యానించారు. వైసీపీలో మహిళలకు ఆత్మగౌరవం లేదంటూ, ఒక ప్రజాప్రతినిధిగా తన పనిని తాను చేయనీయకుండా తమ పార్టీ ప్రవర్తిస్తున్నదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
ఒక గెజిటెడ్ ఆఫీసర్గా ఉండి తాను కేవలం ప్రజాసేవకోసమే రాజకీయాలలోకి వచ్చానని, తానేమిటో, తన కులం ఏమిటో ఆ రోజున వైసీపీ అధినేత జగన్కు తెలియదా అని ఆమె ప్రశ్నించారు. అన్నీ తెలిసి బి-ఫార్మ్ ఇచ్చాక ఇపడు తనపై సోషల్ నెట్వర్క్స్లో అభాండాలు వేస్తున్నారని, కాని పార్టీ తరపున అటువంటి దుష్ప్రచారాలను నిలుపుదల చేసే బాధ్యతను పార్టీ తీసుకోలేదని ఆమె ఆశ్చర్యం వ్యక్తం చేశారు. వైసీపీ నుంచి తమను సస్పెండ్ చేసే ధైర్యం లేకే ఇటువంటి చవకబారు, నేలబారు పద్ధతులను అవలంబిస్తున్నారని ఆమె విమర్శించారు.
No comments:
Post a Comment