టార్గెట్ జగన్! విజేత ఎవరు? - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Tuesday, May 06, 2014

టార్గెట్ జగన్! విజేత ఎవరు?

target jagan mohan reddy

సార్వత్రిక ఎన్నికల సమరానికి సమయం వచ్చేసింది. రాజకీయ పార్టీల ప్రచార హోరు  తగ్గి ప్రజల నిర్ణయానికి తెరలేసింది. ఓటాయుధంతో నాయకుడెవరో తేల్చుకునేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారు. ఏ పార్టీకి ఓటెయ్యాలో, ఎందుకు ఓటెయ్యాలో ఆలోచిస్తే విశ్లేషించుకుంటున్నాడు.  నిజానికి ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల్లో పోటీ ప్రధానంగా రెండు పార్టీల మధ్యే. ఇతర పార్టీలున్నా వాటి పాత్ర నామమాత్రమేనని చెప్పనవసరం లేదు. ప్రధానంగా పోటీ పడుతున్నవి మాత్రం.. తెలుగుదేశం పార్టీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలే! రెండు పార్టీల్లో ఓ దానికి రాజకీయ చాణక్యుడు నాయకత్వం వహిస్తున్నాడు. రాష్ట్ర విభజన నేపథ్యంలో తీవ్రంగా నష్టపోయిందనుకున్న పార్టీని ఎన్నికల వేళకు సన్నద్ధం చేశాడు.  సైద్దాంతిక విబేధాలను సైతం పక్కనబెట్టి జట్టు కట్టారు. అధికారమే పరమావధిగా పొత్తుల పర్వానికి తెరతీశాడు. ఆయనెవరో కాదు తెలుగు దేశం పార్టీ అధినేత...  నారా చంద్రబాబు నాయుడు. అయితే రెండో పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ... మాట తప్పని, మడమ తిప్పని నాయకుడి మరణం తర్వాత తప్పనిసరి పరిస్థితుల్లో ఆవిర్భవించిన పార్టీ. తండ్రి మరణం తర్వాత నమ్ముకున్న పార్టీ ఆంక్షలు విధిస్తుంటే తట్టుకోలేక పార్టీ వీడాడు. సొంత పార్టీ స్థాపించాడు. ఆయనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి.  ప్రజలు వైఎస్ రాజశేఖర్ రెడ్డిపై భరోసాతో 2009లో రెండో దఫా అధికారం ఇస్తే.. విధి ఆయన్ను రాష్ట్ర ప్రజల నుంచి దూరం చేసింది. ఆయన అధికారం తీసుకొచ్చి ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆయన తనయుడినే తన్ని తరిమేసింది. అప్పనంగా ఐదేళ్లూ అధికారాన్ని అనుభవించింది. అంతటితో ఆగకుండా తెలుగుదేశంతో కుమ్మక్కై వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అణగదొక్కాలని ప్రతి దశలోనూ ప్రయత్నించాయి. అక్రమ కేసులు బనాయించి జైలుకు సైతం పంపారు. ఇవన్నీ జగన్ను ఏమీ చేయలేకపోయాయి. చివరకు రాష్ట్ర విభజన నేపథ్యంలో అడ్రస్ గల్లంతైంది. అంతేకాదు మనోధైర్యం మెండుగా ఉన్న జగన్ను బలమైన ప్రత్యర్థిగా మార్చేశాయి. ప్రజల పక్షాన నిలబడి ప్రభుత్వాన్ని నిలదీసే నేతగా ఎదిగేలా చేశాయి.

తీరా ఎన్నికలొచ్చే సరికి జగన్ను విమర్శించడానికి ప్రత్యర్థులకు ఏ ఆయుధాలూ దొరకలేదు. అందుకే నిరూపణ కాని ఆరోపణలనే ఆయుధాలుగా మలచుకున్నారు. అవినీతి, జైలు, బెయిలు, కేసులు, మళ్లీ జైలుకు అంటూ విమర్శలు సంధించారు. మహా నేత తనయుడిపై మసి పూసేందుకు ప్రయత్నించాయి. మీడియా మొత్తాన్ని తమ వైపునకు తిప్పుకుని జగన్ ను టార్గెట్ చేశాయి. గ్రౌండ్ లెవల్ లో లేని ప్రచారాన్ని తెలుగుదేశం పార్టీ సొంతం చేసుకుంది. వీటన్నింటినీ జగన్ పట్టించుకోలేదు. వాటికి అతీతంగానే ముందుకు సాగాడు. పట్టుదల వీడలేదు. మడమ తిప్పలేదు. గ్రామ గ్రామాన తిరిగాడు. జనం తండోపతండాలుగా వచ్చారు. దీన్ని చూసిన ప్రత్యర్థులకు వెన్నులో వణుకు పుట్టింది. తమ బలాన్ని తాము అంచనా వేసుకుని, జగన్ పై పోరుకు చాలదేమో అనుకుని, మరింత పెంచుకుంటూ వచ్చింది. అందులో భాగంగానే సైద్దాంతిక విబేధాలను సైతం పక్కనబెట్టి వెంకయ్యనాయుడు, జయప్రకాష్ నారాయణ, పవన్ కల్యాణ్లతో జత కట్టింది. అధికారం అందుకోవడానికి అడ్డుగా ఉన్న జగన్ ను తొలగించాలని చూసింది. మాజీ కాంగ్రెస్ నేతల్ని పార్టీలో చేర్చుకుంది. అందరితో కలిసి జగన్ను దెబ్బతీసేందుకు ప్రయత్నించింది. ఇప్పుడు వాటి చేయి దాటిపోయింది. యుధ్దం ప్రజల చేతుల్లో ఉంది. రేపు జరిగే పోలింగ్లో విజేతలెవరో ప్రజలే నిర్ణయిస్తారు. 

No comments:

Post a Comment

Post Bottom Ad